ఈనాడు జనులు లోకంలో తాము ఆశించినది ప్రాప్తించకపోతే భగవంతుడినే చూపిస్తూ వున్నారు. తమ స్వార్థం కోసమే భగవంతుడనే వాడు ఉన్నాడని అనుకుంటూ, ఆయనను నిందించే ప్రయత్నం గావిస్తూ వున్నాడు. అంటే భగవంతుడు ఎల్లవేలలా తనకు తృప్తిని కలిగించాలని కోరుకుంటున్నాడు. మరి తాను ఏమి చేస్తున్నాడు? భగవంతునికి తృప్తిని కలిగించే విషయాన్ని ఏనాడైనా ఆలోచించాడా? లేదే. భగవంతుడు కేవలం మంచినే ఆశ్రయిస్తాడనీ, ధర్మాన్నే అంటిపెట్టుకుని వుంటాడని అందరికీ తెల్సిన విషయమే కదా! మనలోని మంచి మనకన్నా భగవంతునికే ఎక్కువ తెలుసు. ఈ విషయాన్ని మనం విశ్వసిస్తున్నామని తెలుసుకో లేకపోవడమే మనలోని అజ్ఞానానికి నిదర్శనం. దైవం ఏదైనా ఎప్పుడైనా చేసాడు అనుకుంటే అది కేవలం మనలోని గుణదోషాలను నిర్మూలించడానికేనని విశ్వసించాలి. తల్లి తన బిడ్డకు ఆరోగ్యం చేకూరాలంటే, అనారోగ్యంగా వున్నప్పుడు చేదు కషాయం ఇస్తుంది. అయినంత మాత్రాన ఆ తల్లికి బిడ్డ మీద ప్రేమ లేదని అందామా? కావున అన్నీ మన మంచికే అని భావించాల్సి వుంది. ఏ రోగం నిమిత్తమై భగవంతుడు ఈ మందును అందించాడో అని మనం భావించాలి. మనం భగవంతుడు ఉన్నాడని నమ్మి ఆయనపై నమ్మకం ఉంచి ఆయనపై భారం వుంచాలి. భగవంతుడిని స్త్రీ అనీ, పురుషుడనీ, సంబంధాలతో గానీ, లింగభేదంతో గానీ చూడరాదు. రాధకు ఆధారం ధార అనగా ఒక విధంగా ఆరాధన. కృష్ణపరమాత్మకు పరమ భక్తురాలు రాధ. రాధ హృదయంలో నిరంతరమూ కృష్ణ చింతనే. ఆవిధంగానే మనం కూడా కృష్ణుని ఆరాధించడంతో మనలో రాధ ప్రేమతత్త్వాన్ని నింపుకోవాలి. ఈ దేహతత్త్వాన్ని మరచి రాధలాగా ప్రేమతత్త్వాన్ని పొందాలి. ప్రేమతత్త్వాన్ని పెంపొదించుకోవాలి. ఆ ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మలో లీనం కావడమే మనకు మధుర భక్తి. ఈ మధుర భక్తితోనే ఆ మధుర నాథుడు మనకు గోచరించేది. అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మయే చూసుకుంటాడు.
- డా.పులివర్తి కృష్ణమూర్తి