IPL 2025 Qualifier 2 | పంజాబ్ vs ముంబై – వర్షం అడ్డంకిగా మారుతుందా !?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్‌… కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా రేపు (ఆదివారం-జూన్ 1న‌) పంజాబ్ కింగ్స్ (PBKS) – ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. అయితే, ఈ కీలక మ్యాచ్ కు ముందే వాతావరణ పరిస్థితులు సందేహాలను సృష్టిస్తున్నాయి.

పంజాబ్‌కి అరుదైన అవకాశమే, ముంబయికి మరో టైటిల్ లక్ష్యం

శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫైనల్ ప్రవేశం కోసం పోరాడుతోంది. 2014 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరుకునే అవకాశం వారికి దక్కనుంది. మరోవైపు, ఐదాసార్లు టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీని అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.

వాతావ‌ర‌ణ పిర‌స్థులు !

వాతావరణ హెచ్చరికల ప్రకారం, మ్యాచ్ సమయంలో అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం 5 శాతం ఉంది. అయితే, ఈ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని నిపుణులు అంటున్నారు.

క్వాలిఫయర్ 2కి నో రిజర్వ్ డే

ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ, క్వాలిఫయర్ 2 కి అలాంటి అవకాశం లేదు. మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే, పాయింట్ల పట్టికలో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.

అదనపు సమయం..

ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ కొన్ని ప్రత్యేక నియమాలను అమలు చేసింది. IPL ఆట పరిస్థితులలోని నిబంధన 13.7.3 ప్రకారం, ఆట పునఃప్రారంభమయ్యే అవకాశాలను పెంచడానికి అదనంగా 120 నిమిషాల అదనపు సమయాన్ని కల్పించారు.

ఇందులో:

ఆట ఆలస్యం అయినా లేదా వర్షంతో ఆట ఆగినా, మొదట ఈ అదనపు సమయాన్ని వినియోగిస్తారు.
అవసరమైతే ఇన్నింగ్స్ మార్పు, స్ట్రాటెజిక్ టైమ్ అవుట్‌ల సమయాన్ని తగ్గించనున్నారు.

ఆటపై ఆశలు ఎక్కువే.. వాతావరణం కీలకం !

అహ్మదాబాద్‌లో భారీ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో అభిమానుల ఉత్కంఠ కూడా పెరిగింది. వర్షం అంతరాయం లేకుండా మ్యాచ్ పూర్తయితేనే నిజమైన విజేత ఎవరో తెలుస్తుంది. లేకపోతే, పాయింట్ల పట్టిక ఆధారంగా పంజాబ్ కింగ్స్ అదృష్టవంతులు అవుతారు. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగే ఈ పోరాటానికి ఆకాశం ఎంతవరకు అనుమతిస్తుందో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *