Delhi | బొగ్గు ఉత్ప‌త్తిలో భార‌త్ కొత్త చ‌రిత్ర‌… ప్ర‌ధాని మోదీ హ‌ర్షం

న్యూఢిల్లీ – బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ ట్వీట్‌ చేశారు. “1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన విజయం, ఇది ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి, స్వావలంబన పట్ల మన నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ఈ ఘనత సాధించేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరి అంకితభావం, కృషిని కూడా ప్రతిబింబిస్తుంది.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇదో కొత్త చ‌రిత్ర – కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.
పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌.. ఆ మార్క్‌ను సాధించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో అధికారిక అకౌంట్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. “హిస్టారికల్‌ మూమెంట్‌. భారతదేశం 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది! అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన పద్ధతులతో, మేము ఉత్పత్తిని పెంచడమే కాకుండా స్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్‌ నిర్వహించాం.

ఈ విజయం త‌మ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, భారతదేశం గ్లోబల్‌ ఎనర్జీ లీడర్‌గా ఎదిగే మార్గంలో ఉంది. దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా పనిచేస్తున్న బొగ్గు రంగం, అంకితభావంతో పనిచేసే శ్రామిక శక్తికి మంత్రి హృదయపూర్వక అభినందనలు. ఈ మైలురాయిని సాధ్యం చేసిన వారి అవిశ్రాంత కృషి, నిబద్ధతకు కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *