ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) 2025లో భాగంగా సూపర్ 4 మ్యాచులు జరుగుతున్నాయి. బుధవారం భారత్(India)తో బంగ్లాదేశ్ (Bangladesh) తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8:00 గంటలకు జరగనుంది. భారత్ తమ మొదటి సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్పై సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరుకుంటుంది. అలాగే బంగ్లాదేశ్ తమ మొదటి సూపర్ 4 మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్లో స్థానం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
భారత్ను ఓడించగలం : బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్
భారత్తో మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “టీమిండియాను ఓడించడం అంత కష్టం కాదు. మేము మా ఉత్తమ ఆటతీరును కనబరిస్తే వారిని గెలవగలం. భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు కావచ్చు, కానీ మేము గెలవలేమన్నది నిజం కాదు. ప్రతి జట్టుకు భారత్ను ఓడించే సామర్థ్యం ఉంటుంది. మేము మా శక్తి మేరకు ఆడితే తప్పులు రాబట్టి, మ్యాచ్ను మలుపు తిప్పగలం. మేము ఆసియా కప్ టైటిల్ గెలవడానికి వచ్చాం. బలమైన జట్లను ఢీకొట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం,” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ జట్టు బుధవారం భారత్తో, మరుసటి రోజు (సెప్టెంబర్ 25) పాకిస్తాన్తో తలపడనుంది. వరుసగా రెండు రోజులు మ్యాచ్లు ఇవ్వడం అన్యాయమని సిమ్మన్స్ అభిప్రాయపడ్డారు.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, జితేశ్ శర్మ.
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్/కెప్టెన్), తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, జాకర్ అలీ, మెహదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తఫిజుర్ రహమాన్, నూరుల్ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్, రిషద్ హుస్సేన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తంజిమ్ హసన్ షకిబ్.

