జన్నారం (ఆంధ్రప్రభ): గంజాయి రవాణాకు పాల్పడుతున్న మండలంలోని పలు గ్రామాలకు చెందిన నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, బైక్ పై వచ్చిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించి పారిపోయేందుకు ప్రయత్నించారని, అయితే వారిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు.
అరెస్టు చేసిన నలుగురు నిందితుల నుండి ఒక కిలో 20 గ్రాముల గంజాయి, రెండు మోటార్ సైకిళ్ళు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
నలుగురు నిందితులను పట్టుకున్న ఎస్ఐ గుండేటి రాజవర్ధన్, హెడ్ కానిస్టేబుళ్లు తుకారాం, ఎండి గౌస్, కానిస్టేబుళ్లు సురేష్, మల్లేష్, శ్రీను, సంతోష్, వెంకటేష్లను డీసీపీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్, తదితరులు పాల్గొన్నారు.