- చార్మినార్, ఫలక్నుమా వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఆదేశాలు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ పనులకు తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ వంటి వారసత్వ ప్రాంతాల్లో మెట్రో నిర్మాణం వారసత్వ భవనాల భద్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొంటూ దాఖలైన పిల్ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ మహమ్మద్ రహీమ్ ఖాన్ హైకోర్టులో ఈ పిల్ ను దాఖలు చేశారు. చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాల ప్రాంగణంలో మెట్రో పనులు జరుగుతుండటం వారసత్వ నిర్మాణాలకు ముప్పుగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హైకోర్టు జస్టిస్ ఆభిలాషా కుమారి నేతృత్వంలోని ధర్మాసనం, తదుపరి విచారణ వరకు మెట్రో పనులను ఆపాలని స్పష్టం చేస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. వారసత్వ భవనాల పరిసరాల్లోని పనులు పూర్తిగా నిలిపివేయాలని పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ను ప్రభుత్వం దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి, మెట్రో రైలు అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను జూలైలోకి వాయిదా వేసింది.