AP | సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి అనిత

విశాఖ : రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నకు మొక్కు తీర్చుకున్నారు. ఇవాళ హోంమంత్రి అనిత సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆమెకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.సుజాత, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వేద పండితులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హోం మంత్రి అనిత మెట్లెక్కి కొండకు వెళ్లి సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు.

తొలిపాంచా వద్ద ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ధ్వజ స్తంభం వద్ద అర్చక పెద్దలతో కలిసి ఈవో సంప్రదాయంగా స్వాగతం చెప్పారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి మనసులోని కోరికలు స్వామివారికి నివేదించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరు అష్టోత్తర శతనామార్చన చేశారు. బేడా మండపంలో మంత్రిని ఆశీనులను చేసి నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అర్చకులు ఆశీర్వాదం చేశారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply