Delhi | విమాన ప్ర‌మాదంపై ద‌ర్యాప్తున‌కు ఉన్న‌త స్థాయి క‌మిటీ.. రామ్మోహ‌న్ నాయుడు

న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు భారత ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, మూల కారణాలను వెలికితీయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Aircraft Accident Investigation Bureau) (ఏఏఐబీ)కు చెందిన సీనియర్ అధికారులతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేందుకు వీరు అంతర్జాతీయ సంస్థల నిపుణులతో కలిసి పనిచేయనున్నారు.

ఈ వివ‌రాల‌ను నేడు ఢిల్లీలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో పౌర విమానయాన శాఖ‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు (Rammohan Naidu) వెల్ల‌డించారు.. ఈ ప్ర‌మాదాన్ని తాము తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌న్నారు.. త‌న తండ్రి కూడా రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించార‌ని, అలాగే విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల బాధ త‌న‌కు తెలుసు అన్నారు. భ‌విష్య‌త్ లో ఇటువంటి ప్ర‌మాదాల జ‌ర‌గ‌కుండా చూస్తామ‌న్నారు.. దీనికోసం అనుభ‌వ‌జ్ఞులైన వారితో ఒక స‌ల‌హా క‌మిటీని ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.. త‌మ‌కు ప్ర‌యాణీకుల భ‌ద్ర‌తే తొలి ప్రాధాన్యం అన్నారు.. అందుకే ప్ర‌స్తుతం నిర్వ‌హ‌ణ‌లో ఉన్న అన్ని విమానాల స్థితిగ‌తుల‌పై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాలని అన్ని విమాన యాన సంస్థ‌ల‌ను కోరామ‌న్నారు.. విమాన ప్ర‌మాద వివ‌రాల‌ను బ్లాక్ బాక్స్ డేటా విశ్లేష‌ణ త‌ర్వాత క్లియ‌ర్ గా తెలుస్తాయ‌న్నారు కేంద్ర మంత్రి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే ఉన్నతస్థాయి కమిటీ రాబోయే కొద్ది వారాల్లో ప్రాథమిక వాస్తవ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఈ దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చే అంశాలు భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి దోహదపడతాయి.

కాగా, దర్యాప్తు బృందాలు ఇప్పటికే విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్స్ (Black box) లను (ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్) స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఒకటి స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, దాని నుంచి సమాచారాన్ని సేకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలిపోవడానికి ముందు జరిగిన సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఈ ఫ్లైట్ రికార్డర్ల నుంచి లభించే సమాచారం అత్యంత కీలకమని భావిస్తున్నారు. సాంకేతిక లోపం (Technical error), విమానం రెక్కల ఫ్లాప్ సెట్టింగ్‌లు లేదా డేటా ఇన్‌పుట్‌లో పొరపాట్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావం వంటి అనేక కోణాల్లో దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.

ఇక‌, ఈ దర్యాప్తు ప్రక్రియలో అంతర్జాతీయ సహకారం కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (National Transportation Safety Board) (ఎన్‌టీఎస్‌బీ) నిపుణులు ఇప్పటికే భారత అధికారులతో కలిసి ఆధారాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అలాగే అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం, కెనడాకు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (టీఎస్‌బీ) కూడా ఒక నిపుణుడిని ఈ దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించేందుకు నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *