హైదరాబాద్ – కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధాని మోదీని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సీయూలో జరిగిన విధ్వంసం విషయంలో మోదీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. హెచ్సీయూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని మోదీ మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు..
కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసమని అన్నారు. . కాంగ్రెస్ చేసిన ఆర్థిక మోసంపై ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, ఆబీఐ, సెబీ, ఎస్ఎఫ్ఐఓలకు ఆధారాలతో సహా తెలియజేశామని చెప్పారు. ఆర్థిక అవకతవకలు జరిగినట్టు కేంద్ర సాధికార కమిటీ కూడా నిర్ధారించిందని, స్వతంత్ర విచారణ చేయాలని కేంద్ర సాధికార కమిటీ సూచించిందని గుర్తు చేశారు. ఆర్థిక అక్రమాలపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు.
నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. నిస్సిగ్గుగా, అక్రమంగా పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు కెటిఆర్. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాదని, కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలన్నారు.