హైదరాబాద్, ఆంధ్రప్రభ :కంచ గచ్చిబౌలి, హెచ్సీయూ రక్షణకు చేతులు కలపాలని పర్యావరణవేత్తలు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారికి బహిరంగ లేఖ రాశారు. హెచ్సీయూ భూముల వివాదాన్ని కేటీఆర్ సీరియస్గా తీసుకున్నారు.
ఈమేరకు రేవంత్ సర్కార్ తీరును లేఖలో ఎండగట్టారు . 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడిందని, 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అని లేఖ ద్వారా కేటీఆర్ పిలుపునిచ్చారు.
విద్యార్థులపైనే అపవాదులు..
ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తోంది. విద్యార్థుల నిరసనకు సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం..
అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్సీయూని ఫోర్త్ సిటీకి తరలిస్తామని హెచ్చరిక తప్పు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడుతామని బీఆర్ఎస్ పార్టీ నుంచి హామీ హామీ ఇస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు