హానికర బాక్టీరియా ఆచూకీ లభ్యం
- గుంటూరులో సంచలనం
గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గుంటూరు నగరంలో కలుషిత తాగు నీటిని విక్రయిస్తున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను(Water plants) జిల్లా అధికారులు సీజ్ చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఏ.తమీమ్(A. Tamim) అన్సారియా గురువారం తెలిపారు.
గుంటూరులో ఇటీవలి కాలంలో డయేరియా(diarrhea) కేసులు నమోదవుతున్ననేపథ్యంలో నగరంలోని మొత్తం 120 మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటి శాంపిల్స్ సేకరించి, మంగళగిరిలోని ఐపీఎంపీహెచ్ ల్యాబ్, గుంటూరు మెడికల్ కాలేజీ పరిధిలోని రీజినల్ పిహెచ్ ల్యాబ్(Regional PH Lab)లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 21 ప్లాంట్ల నీటిలో హానికర బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
దీంతో ప్రభుత్వం ఆ ప్లాంట్లను తక్షణమే మూసివేయాలని ఆదేశించగా, మున్సిపల్ అధికారులు సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సీజ్ చేసిన వాటర్ ప్లాంట్లలో ఐపిడి కాలనీలోని పెర్ల్స్ ఎంటర్ప్రైజెస్(Enterprises), నల్లచేరువులోని నీల్ డ్రాప్, శ్రీనివసరావు తోట 60 అడుగుల రోడ్డులోని మై ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, చరణ్ వాటర్ ప్లాంట్, రెడ్లబజార్లోని(Redlabazar) కె.పి. రావు ప్లాంట్, అంబేద్కర్ నగర్లోని జె.ఎస్. వాటర్ ప్లాంట్, పాతగుంటూరు బాలాజీ నగర్లోని ఏకా వారి వీధి ప్లాంట్, మల్లిఖార్జునపేటలోని గురుశ్రీ మినరల్ వాటర్ ప్లాంట్, ఏ.టి. ఆగ్రహారం బాషా కూల్ డ్రింక్, శివనగారాజు కాలనీలోని వాసవి వాటర్ ప్లాంట్, నెహ్రు నగర్లోని ఆర్.కె. వాటర్ ప్లాంట్, స్వాతి అండ్ ఫుడ్ వాటర్ ప్లాంట్, స్తంబాలగరువులోని ఎలైన్ ఫ్రెష్ వాటర్( Elaine Fresh Water), మద్దిరాల కాలనీలోని పరమేశ్ హోల్సేల్, సంపత్ నగర్లోని నరేష్ షాప్, కొబాల్ద్ పేటలోని ఉమర్ బాషా ఫ్లేవర్డ్ వాటర్, పలకరూరులోని ఎన్.టి.ఆర్ సుజల ప్లాంట్(NTR Sujala Plant), హిమని నగర్లోని సరస్వతి కృష్ణ స్టోర్, బుడంపాడులోని స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్, ఏటుకూరు లోని మేఘన షాప్, లాల్పురం రోడ్డులోని 76వ సచివాలయం వద్ద ఉన్న ప్లాంట్లు ఉన్నాయి.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

