- గర్జిస్తున్న అక్రమ ఆయుధాలు..
- వరుస ఘటనలతో జనం బెంబేలు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక్కప్పుడు అమెరికాలో గన్ కల్చర్ (Gun culture) తెరపైకి వచ్చింది. గతంలో అమెరికా వంటి దేశాల్లో కనిపించే ఈ సంస్కృతి ఇప్పుడు మన రాష్ట్రంలోనూ కనబడటం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ ఆయుధాల వినియోగం పెరగడం వల్ల హత్యలు, దోపిడీలు వంటి నేరాలు పెరుగుతున్నాయి. అమెరికా అంటే భూతల స్వర్గం అంటారు. అలాంటి అమెరికా (America) ను ఎప్పట్నుంచో గన్ కల్చర్ పట్టి పీడిస్తోంది. ఆత్మ రక్షణ నిమిత్తం తుపాకీలను కొనుగోలు చేయచ్చని అమెరికా పౌరులకు రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. దీంతో అక్కడి పౌరులు విచ్చలవిడిగా తమకు నచ్చిన తుపాకులను కొనేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రంలోని జరిగిన కొన్ని ఘటనలు అమెరికా గన్ కల్చర్ ను గుర్తుచేస్తోంది.
హైదరాబాద్ (Hyderabad) లో తరచూ అక్రమ ఆయుధాలు గర్జిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నాటు తుపాకులు, రివాల్వర్లు, పిస్టళ్లు తెప్పించుకుంటున్న కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. దోపిడీలు చేయడమే వృత్తిగా చేసుకున్న వారు కూడా వీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో జనంలో తీవ్ర కలవరం వ్యక్తమవుతున్నది. మొన్న సీపీఐ నేత హత్య… తాజాగా దోపిడీ సీపీఐ రాష్ట్ర నేత చందూ నాయక్ (Chandu Nayak) ఇటీవల శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ ముగించుకుని బయటకు రాగానే అతని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈ ఉదంతాన్ని మరిచిపోక ముందే తాజాగా దోపిడీ దొంగలు చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు.
అక్కడ కుటీర పరిశ్రమల్లా..
ఉత్తరప్రదేశ్, బిహార్ (Uttar Pradesh, Bihar) రాష్ట్రాల నుంచి ఎక్కువగా అక్రమ ఆయుధాలు నగరానికి వస్తున్నట్టు చెప్పారు. ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాటు తుపాకులు, పిస్టళ్లు, రివాల్వర్లు తయారు చేయడం కుటీర పరిశ్రమలా మారిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. ముఖ్యంగా బిహార్ లోని ముంగేర్, గయ, ఉత్తరప్రదేశ్ లోని నాన్ గల్, హసన్ పూర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అక్రమ ఆయుధాల తయారీ జరుగుతున్న ట్టు చెప్పారు. ఒకప్పుడు తపంచాలు మాత్రమే తయారు చేసే తయారీదారులు ఇప్పుడు సేఫ్టీ లాక్ (Safety lock) ఉన్న రివాల్వర్లను కూడా తయారు చేస్తున్నట్టు తెలిపారు.
వేలల్లోనే ధరలు..
అక్రమ ఆయుధాల (Illegal weapons) తయారీదారులు తపంచాను 2 నుంచి 4 వేలకు, రివాల్వర్ ను 10 నుంచి 15వేలకు అమ్ముతున్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. పిస్టల్ 15 నుంచి 20 వేలకు, సింగిల్ షాట్ గన్ ను 20వేల వరకు విక్రయిస్తున్నట్టు తెలిపాయి. ఆటోమేటెడ్ పిస్టల్ (Automated pistol) 20 నుంచి 25 వేలు, ఆటోమేటెడ్ రివాల్వర్ ను 30 వేలకు అమ్ముతున్నట్టు పోలీసు వర్గాలు చెప్పాయి.
ఆయుధాల ట్రాన్స్ పోర్టు రైళ్లు, లారీల్లోనే..!
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,125 లైసెన్సులు జారీ అవగా 9,294 ఆయుధాలున్నాయి. గడిచిన మూడేళ్లలోనే కొత్తగా 510 లైసెన్సులు జారీ అయ్యాయి. అయితే, అధికారికంగా ఉన్న వాటికి రెండింతల అక్రమ ఆయుధాలు ఉండి ఉండవచ్చని పోలీస్ వర్గాలు అంటున్నాయి. పోలీస్ వర్గాల నుంచి తెలుస్తున్న వివరాల ప్రకారం.. అక్రమ ఆయుధాలను (Illegal weapons) ఇక్కడికి తరలించడానికి కొన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి. వీటిల్లోని సభ్యులు రైళ్లు, ట్రాన్స్ పోర్ట్ లారీల్లో ఇక్కడికి చేరుస్తున్నారు.
రైళ్లలో పెద్దగా తనిఖీలు జరగక పోతుండడం, ట్రాన్స్ పోర్టు లారీలను పట్టించుకోక పోతుండడంతో వీరి ఆయుధ స్మగ్లింగ్ వ్యాపారం (Arms smuggling business) నిరాటంకంగా సాగుతున్నది. ఏదైనా గ్యాంగ్ అక్రమ ఆయుధాలతో దొరికితే వారి అరెస్టుతోనే కేసులు ఆగిపోతున్నాయి. దీనికి కారణం ఆయుధాలు తయారవుతున్న రాష్ట్రాలకు మన పోలీసులు ( police) వెళ్లినా అక్కడి పోలీసులు సహకరించకపోతుండడమే అని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. కొన్నిసార్లు మన పోలీసులపై దాడులు కూడా జరిగాయని తెలిపారు. దాంతో ఏమీ చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించాయి. ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం కుదిరితేనే అక్రమ ఆయుధాల దందాకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నాయి.