సింగరేణి మహిళా కళాశాల స్వర్ణోత్సవం..

  • లోగోను ఆవిష్కరించిన సీఎండీ బలరామ్

సింగరేణి సంస్థ కొత్తగూడెంలో తొలి మహిళా కళాశాలను ప్రారంభించి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ రూపొందించిన గోల్డెన్ జూబ్లీ లోగోను సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ బుధవారం హైదరాబాద్ నుండి వర్చువల్ గా ఆవిష్కరించారు.

మహిళా విద్యకు అంకితమై ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఈ కళాశాల మరింతగా వృద్ధి చెందాలని, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ కళాశాలగా ఎదగాలని ఛైర్మన్ ఎన్.బలరామ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (పి.పి,పా) కె.వెంకటేశ్వర్లు, సి.పి.పి. ఎ.మనోహర్ కొత్తగూడెం నుండి సింగరేణి విద్యాసంస్థల కార్యదర్శి గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

1975వ సంవత్సరంలో సింగరేణి సంస్థ మహిళా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి మారుమూల, గిరిజన ప్రాంతమైన కొత్తగూడెంలో సింగరేణి మహిళా కళాశాలను ప్రారంభించడం జరిగింది. ఈ కళాశాలలో సింగరేణి కార్మికుల అధికారుల పిల్లలే కాక సమీప పట్టణాల గ్రామాలకు చెందిన వారు కూడా ఈ కళాశాలలో చదివిన అనేకమంది డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉద్యోగులుగా స్థిరపడ్డారు.

నాటినుండి ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ డిగ్రీ కళాశాలగా, పీజీ కళాశాలగా కూడా ఎదిగింది. తొలుత ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా ఉంది. సుమారు 2000 మంది ఈ కళాశాలలో చదువుతున్నారు.

హాస్టల్ వసతి, క్రీడా మైదానాలు, మంచి ప్రయోగశాలలు, ఆడిటోరియం వంటి అత్యుత్తమ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కళాశాల కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో చదువులోనూ, క్రీడల్లోనూ అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. గోల్డెన్ జూబ్లీ సంవత్సరం సందర్భంగా ఏడాది పొడుగునా పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *