నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో నకిలీ స్పర్శ దర్శనం టికెట్ల వ్యవహారం మరిచిపోక ముందే దేవస్థానంలో హుండీలో దొంగతనం కలకలం రేగింది.
ఈ నెల 1వ తేదీన ఉచిత దర్శన క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మైనర్ బాలురు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయంలోని వస్త్ర హుండీని బ్లేడుతో కోసి కానుకలను దొంగిలిస్తూ ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. వారి నుంచి దాదాపు రూ.10,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం తెలుసుకున్న ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దేవస్థానం ఇన్ ఛార్జ్ భద్రతా అధికారి మల్లికార్జునరెడ్డి శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు, ఇద్దరు మేజర్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.