హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) యూకే(Britain ) పర్యటనకు బయల్దేరారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఇంగ్లండ్లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో (Oxford University) జరుగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో (Seminar ) ముఖ్యవక్తగా పాల్గొననున్నారు.
ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ (Frontier Technologies for Development in India) అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొననున్నారు. టెక్నాలజీ ద్వారా భారత్ సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే అంశంపై చర్చించనున్నారు. కేటీఆర్ ఈ నెల 24న హైదరాబాద్ చేరుకుంటారు.