Fishing Hunt Ban | ఇక ఒడ్డునే మర పడవలు – నేటి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

విశాఖ‌ప‌ట్నం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల వేటకు ప్రభుత్వం బ్రేక్ ప్రకటించింది. గత అర్ధరాత్రి నుంచి అమ‌లులోకి వ‌చ్చిన ఈ నిషేధం జూన్ 14 అర్ధరాత్రి వరకు 61 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో సముద్రంలో వేటకు వెళ్లడంపై పూర్తిగా నిషేధం విధించింది. మత్స్య శాఖ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, మత్స్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో తీరప్రాంతాల్లో గస్తీ బలగాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా సముద్రంపై నిఘా పెంచారు. అనుమతి లేకుండా వేటకు వెళ్లే బోటులను సీజ్ చేస్తామని.. సంబంధిత మత్స్యకారులపై కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిషేధం ప్రధానంగా మెకనైజ్డ్ బోట్లు, మోటార్ బోట్లపై వర్తిస్తుంది.

తడ (తిరుపతి జిల్లా) నుంచి ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) వరకు 1,027 కిలోమీటర్ల మేర విస్తరించిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో, సుమారు 65 మండలాల్లోని 555 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 8.5 లక్షల మంది మత్స్యకారులు జీవిస్తుండగా.. వారిలో 1.63 లక్షల మంది సముద్ర వేటపై ఆధారపడి తమ కుటుంబాలను పోషిస్తున్నారు. కేవలం కాకినాడ జిల్లాలోనే 24,500 మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ 483 మెకనైజ్డ్ బోట్లు, 3,800 మోటార్ బోట్లు వాడుతుండగా.. ఇప్పుడు ఈ వాహనాలపై వేట నిషేధం అమల్లో ఉండనుంది.

ఎందుకు నిషేధం?

మత్స్య సంపదను సంరక్షించేందుకు చేపల వేటకు ప్రతి ఏటా ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. ఈ కాలంలో చేపలు, ఇతర జలచరాల తరం మారే కాలం కావడంతో, వాటి వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈ తరహాగా చర్యలు చేపట్టడం ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేట నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు సైతం చేపట్టింది.

మినహాయింపు..
కాకినాడ జిల్లాలోని 419 సాంప్రదాయ బోట్లకు మాత్రమే వేట నుంచి ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయినప్పటికీ వీటిని వినియోగించేటప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. మరోవైపు వేటపై నిషేదం కారణంగా మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహాయ పథకాలను అందిస్తోంది. వీటిలో ఇన్‌పుట్ సబ్సిడీలు, నిత్యావసర సరుకుల పంపిణీ, ఇతర ఆర్థిక ప్యాకేజీలు అందిస్తుంది. అంతే కాకుండా మత్స్యకారుల్లో నిషేధంపై అవగాహన పెంచేందుకు పలు ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. గ్రామాల్లో సమావేశాలు నిర్వహణ, ఫ్లెక్సీలు ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వేల నిషేధ కాలంలో ప్రతి కుటుంబానికి రూ .15 వేలు ఆర్థిక సాయం అందించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *