స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు
బిక్కనూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల (LocalBodyElections) ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండు రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏ స్థానం ఎవరికి రిజర్వుడు అవుతుందో పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ , సర్పంచ్ తోపాటు వార్డు సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రానున్నాయి. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి నివేదికలను ఎన్నికల సంఘానికి పంపించనున్నారు.
కామారెడ్డి జిల్లాలో 6,39,730 మంది ఓటర్లు ఉండగా, అందులో 3,07,508 మంది పురుషులు, 3,32209 మంది స్త్రీలు ఉండగా ఇతరులు 13 మంది ఉన్నారు. జిల్లాలో 532 గ్రామపంచాయతీలు ఉండగా 4656 వార్డు స్థానాలు ఉన్నాయి. 25 జెడ్పిటిసి సభ్యులు ఉండగా 25 ఎంపీపీలు, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ (Reservation) ప్రక్రియ పూర్తి అవుతే ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వార్డులలో కులాల వారీగా పురుషులు, స్త్రీలు ఎంతమంది ఉన్నారన్న వివరాలు లెక్క తీస్తున్నారు. వాటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఏ స్థానంలో ఎవరికి ఏ రిజర్వేషన్ కలిసి వస్తుందో మరో రెండు రోజులు వేసి చూడాల్సిందే.