నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 23(ఆంధ్రప్రభ) : రైతుల చిరకాల స్వప్నమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 29న రానున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ (BJP) జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు.
రైతుల భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు పునాది అని ఎంపీ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం చారిత్రాత్మక రోజుగా మార నుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతులకు నూతన శకం ప్రారంభమైందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 29న నగరంలోని వినాయక్ నగర్ లో గల జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని (National Turmeric Board Headquarters) ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. అనంతరం దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం కంటేశ్వర్ లోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతుల సమ్మేళన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొననున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
29న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్ర హోంమంత్రి పర్యటన ఉంటుందని తెలిపారు. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ విగ్రహాన్ని (Statue of Sardar Vallabhbhai) తయారు చేసిన పద్మభూషణ్ రామసుతారే చేతులమీదుగా దివంగత నేత డి.శ్రీనివాస్ విగ్రహం తయారు చేయడం జరిగిందన్నారు. దివంగత నేత డి.శ్రీనివాస్ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలో డీఎస్ విగ్రహావిష్కరణ కేంద్ర హోంమంత్రి చేతులమీదుగా ఆవిష్కరణ జరగనుంది. డీఎస్ అభిమానులు, అందరూ విగ్రహావిష్కరణలో పాల్గొనాలని కోరారు. రైతు సమ్మేళన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులను ప్రజలు గప్పా గప్పా గుద్దారనీ ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ నేతలను రప్పా రప్పా రఫ్ జైల్లో వేయాలని ఎంపీ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.