కుప్పం, 27జూన్(ఆంధ్రప్రభ) : కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మంజూరు చేయడం పట్ల కుప్పం ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శ్రీకాంత్ పేర్కొన్నారు. విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ కోర్సులు మంజూరవడం కుప్పం (Kuppam) విద్యాభివృద్ధిలో మరో కీలక ముందడుగు అన్నారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కుప్పం ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (MLC Kancharla Srikanth) హర్షం వ్యక్తం చేస్తూ కుప్పం విద్యారంగ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. చాలా కాలంగా విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి, కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబుతోనే సాధ్యమవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు.