Election Material | సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

Election Material | సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
- సిబ్బంది చెక్ లిస్ట్ చూసుకోవాలి
- ఎన్నికల అబ్సర్వర్ రవి కిరణ్
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Election Material | జనగామ, ఆంధ్రప్రభ : గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల అబ్జర్వర్ రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, లింగాల ఘనపూర్, జాఫర్ ఘడ్, రఘునాథ్ పల్లి మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను అబ్సర్వర్ రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణీని పరిశీలించారు.

ముందుగా ఘన్పూర్ లోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ ని చెక్ చేశారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మైక్రో అబ్సర్వర్ లతో మాట్లాడి పలు సూచనలు చేసారు. అనంతరం చిల్పూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లి ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బా క్సులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్త గా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూ షన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు.

సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పించాలని విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయేదారుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం రఘునాథ్ పల్లి జడ్పీ సెకండరి స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ లతో మాట్లాడి రేపు వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లు వెంకన్న, గోపి రాం, తహసీల్దార్ లు,ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
