మయన్మార్ – భూకంప తీవ్రతకు మయన్మార్ కకావికలం అయ్యింది. సాగయింగ్ సమీపంలో 7.7 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన భూకంపం ధాటికి మయన్మార్ విలవిల్లాడింది. వరుసగా వచ్చిన ఆరు భూకంపాలు మయన్మార్, థాయ్లాండ్ దేశాలను భయ కంపితులు చేశాయి. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కుప్ప కూలిపోయాయి. వందల మంది చనిపోయారు.. వేల మంది శిథిలాల కింద చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, ఆర్మీ ముమ్మర సహాయక చర్యల్లో నిమగ్నం అయి ఉన్నాయి. ఈ భూవిలయంలో సుమారు ఇప్పటికే వెయి మందికి పైగా మరణించారని అధికారికంగా ప్రకటించారు. మరో నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. అంతేకాక భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. కూలిన భవనాల శిధిలాలను వెలికితీస్తున్నకొద్ది శవాలు గుట్టలు గుట్టలుగా బయడపడుతున్నాయి..
భూకంప తీవ్రతకు.. మయన్మార్లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, పలు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన ఆలయాలు, గోపురాలు కుప్పకూలాయి. అలానే మయన్మార్ రాజధాని నేపిడాలోని ప్రధాన రహదారులన్ని దెబ్బతిన్నాయి. థాయ్లాండ్లో కూడా ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరో చోట భారీ బిల్డింగ్ కూలడంతో.. సుమారు 100మందికి పైగా గల్లంతయ్యారు. ఇరు దేశాల్లోను సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ దేశంలో ఇప్పటి వరకు 43 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు.