ముందు వచ్చిన వారికి ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లు
- ఈ నెల 27వ తేదీన అమరావతిలోని ఎస్వీ ఆలయం విస్తరణ పనులు
- పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
- డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీ చేయడానికి గతంలో ఉన్న డిప్ విధానం కాకుండా, ఆన్లైన్లో ముందు వచ్చిన వారికి ముందు అనే పద్ధతిలో వచ్చే ఫిబ్రవరి నుండి కేటాయించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

- తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.
- భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు పర్మినెంట్ షెల్టర్, క్యూ లైన్, స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి, టాయిలెట్స్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం.
- భక్తుల సూచనల మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
- రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5 వేల భజన మందిరాల నిర్మాణం.
- తిరుమల అటవీ ప్రాంతంలో రానున్న పదేళ్లలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం.
- టీటీడీ ఆలయాలలోని ఆయా ప్రాంతాలలో భక్తుల రద్దీకి తగ్గట్లుగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో గల వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
- శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మి మోసపోయిన్నట్లు ఇటీవల హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి ఫిర్యాదులు తరచు వస్తున్నాయి. కావున భక్తులు శ్రీవారి దర్శనానికి దళారుల మాటలు విని మోసపోవద్దని, ఆన్లైన్ ద్వారానే దర్శన టోకెన్లు పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో కే.వి.మురళీకృష్ణ, సీఈ టి.వి.సత్యనారాయణ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

