- కులగణనపై అనుమానాలు నివృత్తి చేస్తాం
- ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా ?
- బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో నిర్వహించిన కులగణన మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధాన మంత్రి దగ్గర సమయం ఇప్పిస్తారా ? అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డెడికేటెడ్ కమిషన్ వేసుకొని లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో పారదర్శకంగా సర్వే నిర్వహించామని తెలిపారు. మహారాష్ట్రలో బీసీ కులగణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారని, బీహార్ లో కులగణన చేపట్టి ఆ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే ఆర్జేడీ, జేడీయూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని ఆరోపించారు. జార్ఖండ్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం పెట్టగానే తప్పుడు కేసులతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ను జైల్లో వేశారని, అటువంటి చరిత్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వానిదని తీవ్ర ఆరోపణలు చేశారు.
బీసీ రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్…
రాష్ట్రాల నుంచి కేంద్రం వరకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం కొనియాడారు. బీజేపీ అధ్యక్ష పదవి, శాసనసభలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడి పదవి, మండలిలో పక్ష నాయకుడి పదవులకు బీసీలు పనికిరారా? అని నిలదీశారు. అన్ని అత్యున్నత పదవులు వేరే సామాజిక వర్గానికి కేటాయించిన బీసీలపై మొసలి కన్నీరు కారిస్తే ఎవరు అంగీకరిస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషికి గండి కొట్టొద్దన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన బిల్లును ఆమోదింపజేసి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
ఐఐటీ, ఐఐఎంలో కూడా..
కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఎం లాంటి వాటిలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని మంత్రి గుర్తుకు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులగణన కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లి అఫిడవిట్ సమర్పించిన చరిత్ర బీజేపీదన్నారు. మండల్ కమిషన్ వస్తే కమండలం తీసుకొచ్చింది బీజేపీ.. బీజేపీ అగ్రవర్ణాల ఫ్యూడలిస్ట్ పార్టీ అని విమర్శించారు. కులగణన చేసి బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచి చేసిన చట్టం తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా మారిందన్నారు. తెలంగాణను చూసే తప్పని పరిస్థితుల్లో కేంద్రంలో జన గణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. తెలంగాణలో చేసిన కుల గణన చూసి దేశవ్యాప్తంగా చేస్తున్నారని, ఇక్కడ చేసిన కుల సర్వే ఆధారంగా పెంచిన 42శాతం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ చేసిన చట్టాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.