Rupee Value | రూపాయి విలువ మరింత పతనమవుతుందా?
పతనమైతే మనదేశ ఆర్థిక పరిస్థితి ఏమిటి?
ఇదీ ఆందోళనకరమా?.. ధరలు పెరుగుతాయా?
కేంద్రం రూపాయి విలువ పెంచాలన్న ప్రయత్నంలో ఉందా?
ప్రతి ఒక్కరీ మదిలో ఉన్న ప్రశ్నలు
Rupee Value | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రూపాయి విలువ (Rupee Value) ఒక్కసారిగా పతనమైంది. మరింతగా విలువ తగ్గిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రూపాయి విలువ తగ్గడం సహజం. కానీ ఐదు నెలలో భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ.90కి పడిపోయింది. రూపాయి విలువ రోజురోజుకూ కనిష్ట స్థాయికి ఎందుకు చేరుకుంటోంది? డాలర్, రూపాయి మధ్య అంతరం క్రమంగా ఎందుకు పెరుగుతోంది? అని ప్రజలు చర్చించుకుంటున్నారు . ఒక డాలర్ (dollar) విలువ వంద రూపాయలు దాటవచ్చని కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మన దేశ ఆర్థిక పరిస్థితి ఏమిటి? అనేది చర్చ ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది.
Rupee Value |డాలర్తో ఎందుకు పోలుస్తారు?
ప్రపంచ దేశాలతో (world Countries) పాటు మన దేశం కూడా అమెరికా, ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో వర్తక వాణిజ్యాల చెల్లింపులు అమెరికన్ డాలర్లలోనే జరుగుతాయి. దీంతో ప్రపంచ దేశాల కరెన్సీ అమెరికన్ డాలర్తో పోలుస్తారు. అమెరికా డాలర్ విలువ పెరిగినప్పుడు మిగిలిన దేశాల కరెన్సీ కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తారు. ఈ క్రమంలో అమెరికా డాలర్తో మన రూపాయి విలువ లెక్క కట్టారు. ఒక డాలర్ విలువతో మన కరెన్సీ రూ.90లు ఉంది. ఐదు నెలల కిందట రూ.85లు ఉండగా, ఇప్పుడు రూ.90లకు చేరింది. అమెరికాలో డాలర్ విలువ పెంచడానికి ఆ దేశంలో చర్యలు తీసుకోవడం, అమెరికాతో మనకు ఉన్న వాణిజ్య ఎగుమతులు తగ్గిపోవడంతో ఒక డాలర్ విలువకు రూ.100లు సమానమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Rupee Value |రూపాయి విలువ తగ్గడానికి కారణాలు…
అమెరికా భారతదేశంలోకి డాలర్ (dollar) రాకుండా అడ్డుకోవడం కోసం అన్నిమార్గాలను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలను వెనక్కి పిలుస్తోంది. ఇక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలు తమ డాలర్ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కూడా కోరుతోంది. భారతదేశంలో కర్మాగారాలను స్థాపించే, స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు మందగించాయి. భారతదేశం వంటి దేశాలలో పెట్టుబడులు పెట్టే బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ అమెరికన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పెట్టుబడి తగ్గుదల భారతదేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని తగ్గించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) భారతీయ వస్తువులపై 50% సుంకం విధించారు. గతంలో $100కి అమ్ముడయ్యే దాని ధర ఇప్పుడు $150. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతదేశం నుండి దిగుమతులను తగ్గించుకుని, వియత్నాం లేదా బంగ్లాదేశ్ వైపు చూస్తున్నాయి. ఇది ఎగుమతుల నుండి (వస్తువులు, సేవలు రెండూ) భారతదేశానికి వస్తున్న డాలర్లలో గణనీయమైన భాగాన్ని సూచిస్తుంది.
భారతదేశం విదేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేయాల్సి వచ్చింది. మనం రష్యా (Russia) నుంచి చమురు దిగుమతి చేసుకునేటప్పుడు, మన డాలర్ అవసరాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు రష్యా నుంచి మన చమురు దిగుమతులు తగ్గడంతో, మనం ఇతర దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుని డాలర్లలో చెల్లింపులు చేయవలసి వస్తుంది. దీని వల్ల డాలర్ డిమాండ్ పెరిగింది.
అమెరికా వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు అక్కడి పెట్టుబడులు అధిక వడ్డీ రేట్లను ఇస్తున్నందున, చాలా మంది పెట్టుబడిదారులు భారతదేశం వంటి మార్కెట్ల నుండి డబ్బును ఉపసంహరించుకుని అక్కడ పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు.
Rupee Value |ఎగుమతి దారులకు ప్రయోజనం…
రూపాయి బలహీన పడితే ఎగుమతులు చేసే కంపెనీలకు ప్రయోజనం ఉంటుంది. ఐటీ కంపెనీలకు కూడా పెద్ద మొత్తంలో లాభం లభిస్తుంది. ఐటీ కంపెనీలన్నీ కూడా ఎక్కువగా విదేశీ ప్రాజెక్టులను స్వీకరించి చెల్లింపులను కూడా డాలర్ల (dollar) రూపంలో తీసుకుంటాయి. తద్వారా రూపాయి విలువ తగ్గడం వల్ల డాలర్ల పై ఎక్కువ రూపాయలను వీరు పొందుతారు. ఇక్కడ నుంచి ఎగుమతి చేసే వస్తువులకు, మందుల తయారీ చేసే ఫార్మా కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది.
Rupee Value | ధరలు పెరిగే అవకాశం…
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పెట్రోల్, ఫోన్లు, యంత్రాలు ధరలు పెరుగుతాయి. దిగుమతులకు డాలర్లోనే డీల్ ఉంటుంది. రూపాయి తగ్గితే, దిగుమతి ధర పెరుగుతుంది. దీని వల్ల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. దిగుమతులు పెరిగి, ధరలు పెరిగే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్ (Petrol, diesel) ధరలు పెరిగితే దీని ప్రభావం రవాణా వ్యవస్థపై పడుతుంది. తద్వారా సామాన్యులు కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై ధర పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొనుగోలు శక్తి పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.

