FOREST | మాకు న్యాయం చేయండి..
తహసీల్దార్కు చెంచుల వినతి
FOREST | బండి ఆత్మకూరు, ఆంధ్రప్రభ : 40 ఏళ్లుగా పంటలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అటవీ (Forest) అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బండి ఆత్మకూరు తహసీల్దార్ పద్మావతమ్మకి నాయిని చెరువుగూడెం గిరిజనులు వినతి పత్రం అందజేశారు. సోమవారం మండల తహసీల్దారు కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజనులు తమ గోడును అధికారులకు విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా గిరిజనులు (Tribes) భూమాని గుండన్న, జమాలి మాట్లాడుతూ.. 40 ఏళ్లు భూములు సాగు చేసుకుంటున్నామని, ఫారెస్ట్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్రిస్తున్నారని తెలిపారు. గతంలో సర్వే చేసి మేము సాగు చేసుకుంటున్న భూములు సొసైటీ ద్వారా 15 మంది గూడెం గిరిజనులకు ఇచ్చారన్నారు. మా భూముల సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేసి పాసు పుస్తకాలు జారీ చేయాలని తహసీల్దారును కోరారు. గిరిజనుల భూ సమస్యలు రెవెన్యూ అటవీ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తెలిపారు.

