ధర్మం – మర్మం : భీష్మ ఏకాదశి (ఆడియోతో…)

మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా బ్రహ్మాండ పురాణం, మహా భారతం ద్వారా తెలుస్తోంది. భీష్ముడు మాఘ శుక్ల అష్టమి నాడు తనువు చాలించి నా వైకుంఠానికి చేరడానికి మూడు రోజులు పడుతుంది. కావున ఏకాదశి నాడు భీష్ముడు మోక్షాన్ని పొందాడని ప్రసిద్ధి. అందుకే మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి అని అంటారు. ధర్మరాజుకు, భీష్ముడు సకల ధర్మములలో ఉత్తమ ధర్మము శ్రీవిష్ణు సహస్రనామములతో స్తోత్రము చేయుట అని చెప్పెను. అందుకే భీష్మునికి ఇష్టమైన విష్ణు సహస్రనామమును ఈ ఏకాదశి నాడు ఉపవాసముతో మూడు మార్లకు తగ్గకుండా శక్తి మేరకు పారాయణము చేయవలెను. భీష్మ ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు అఖండ విష్ణు సహస్రనామ పారాయణ జరిగితే పరమాత్మ వైకుంఠాన్ని ప్రసాదిస్తారు, మరు జన్మ ఉండదు. ఏకాదశి, ద్వాదశి తిథులలో నిర్వహించే తిల తర్పణ మంత్రం.

వైయగ్ర పాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ
అపుత్రాయ దదామ్య తత్‌ జలం భీష్మాయ వర్మ‌ణే
వసూనాం అవతారాయ శంతనోరాత్మజాయ చ
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆ బాల బ్రహ్మచారిణే

ఇలా ఈ మంత్రములతో అర్ఘ్యం, తిల తర్పణం చేసి మరునాడు అనగా ద్వాదశి నాడు శ్రాద్ధం, అన్నదానం చేసినచో పునర్జ న్మ ఉండదు. జీవితంలో బ్రతికినంత కాలం అన్ని కోరికలు నెరవేరి ఆనందముగా ఉండెదరు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *