Delhi | యుకె మాజీ ప్రధానితో సీఎం రేవంత్ భేటీ !

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు న్యూఢిల్లీలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై గంటపాటు విశ్లేషణాత్మక చర్చ జరిగింది.

ఈ సందర్భంగా, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక ‘తెలంగాణ రైజింగ్ 2047’ లోని ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి బ్లెయిర్‌కు వివరించారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం రెండవ వార్షికోత్సవం సందర్భంగా, 2025 డిసెంబర్ 9న ఈ విజన్ డాక్యుమెంట్ అధికారికంగా విడుదల చేయనుంది.

టోనీ బ్లెయిర్ త‌న‌ పదవీ విరమణ తర్వాత, ‘‘టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్’’ (TBI) ను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులకు కాంక్రీట్ అభివృద్ధి వ్యూహాలను రూపొందించడానికి.. అమలులోకి తీసుకురావడానికి సహాయపడే సంస్థగా టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ గుర్తింపు పొందింది.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య పరస్పర సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, అమలులో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఏర్పడనుంది.

తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలపై బ్లెయిర్ ప్రత్యేక ఆసక్తి

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయదారులు, యువత, మహిళలు వంటి ముఖ్యమైన సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను వివరిస్తూ, కోర్ అర్బన్, పరి-అర్బన్, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా రూపొందించిన మైక్రోప్లానింగ్ దృక్కోణాన్ని పరిచయం చేశారు.

తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలో స్థిరత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను బ్లెయిర్ ప్రశంసించారు. ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కీలక ప్రాజెక్టులపై ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు డా.మళ్ళు రవి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కార్యనిర్వహణ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ లు హాజరయ్యారు.

Leave a Reply