ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఉత్కంఠగా సాగుతోంది. సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ నేడు (బుధవారం) తమ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో ఢిల్లీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్ లో తొలి నాలుగు మ్యాచుల్లో జైత్రయాత్ర కొనసాగించిన ఢిల్లీ… ఐదో మ్యాచ్ లో ముంబై చేతిలో ఓటమిపాలైంది. అయితే, నేటి మ్యాచ్ గెలిచి తిరిగి ట్రాక్లోకి రావాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఢిల్లీ జట్టు రెండో స్థానంలో ఉంది.
మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్.. రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి, మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. గత రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన రాజస్థాన్ ఢిల్లీతో మ్యాచ్లో గెలిచి విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఆర్ఆర్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
అయితే, రెండు జట్లు తమ గత మ్యాచ్లలో ఓటమిని చవిచూడడం గమనార్హం. ఢిల్లీ, రాజస్థాన్ రెండూ విజయాల బాట పట్టేందుకు చూస్తున్నాయి. దీంతో దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.
హెడ్ టు హెడ్ గణాంకాలు..
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చాలా కఠినమైన పోటీ ఉంది. ఇప్పటివరకు ఆ రెండు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్లు జరగగా, ఢిల్లీ 14 సార్లు, రాజస్థాన్ 15 సార్లు గెలిచింది. ఐపీఎల్ 2024 సమయంలో ఇరుజట్ల చెరో మ్యాచ్ గెలిచాయి.