కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి మరీ అత్యాచారాలు
ఓ బాలిక మిస్సింగ్ కేసుతో బయటపడిన ఘోరాలు
హనుమకొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఓ బాలిక మిస్సింగ్ కేసుతో బాలికలపై జరుగుతున్న ఘోరాలు వెలుగు చూశాయి. గత కొంత కాలంగా ఓ మహిళ నాయకత్వంలో ఆరుగురు ముఠా సభ్యులు బాలికలపై అఘాయిత్యాలకు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ ముఠాలో కీలకపాత్ర పోషిస్తున్న ఆ మహిళ ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
అరాచాకాలు జరుగుతుందిలా…
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ వరంగల్, మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆ లేడీ తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా మారారు. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ కిలాడీ లేడీ వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తుంది. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకుని, కలివిడిగా ఉన్నట్టు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి తన గ్యాంగ్ కు వారిని అప్పగిస్తోంది. కిలాడీ లేడీకి డబ్బు ఇచ్చే మానవ మృగాలు బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోతారు.
ఇలా వెలుగులోకి వచ్చింది..
ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలినట్లు సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. సదరు కిలాడీ లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.