Cricket Academy | టైటిల్ ‘రైడర్స్’దే!
- బ్లాస్టర్స్ను చిత్తు చేసిన ఎంఎంసీఏ రైడర్స్ జట్టు
- అలరించిన అభి.. ఆకట్టుకున్న శ్రీకాంత్
- అకాడమీకి స్థల కేటాయింపుపై కాంగ్రెస్ నేతల హామీ
Cricket Academy | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : స్థానిక ఏఎంసీ మైదానం వేదికగా జరిగిన క్రికెట్ లీగ్ టోర్నమెంట్(Cricket League Tournament) పోరు ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో ఎంఎంసీఏ రైడర్స్ జట్టు సమిష్టి కృషితో సత్తా చాటి, ఎంఎంసీఏ బ్లాస్టర్స్ జట్టుపై ఘన విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది.
ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ తుది సమరంలో రైడర్స్ ఆటగాళ్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఆధిపత్యం ప్రదర్శించి మైదానంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. మొదట టాస్ గెలిచిన బ్లాస్టర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. రైడర్స్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. కట్టుదిట్టమైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్(Fielding)తో రైడర్స్ జట్టు ఒత్తిడి పెంచడంతో బ్లాస్టర్స్ జట్టు 16 ఓవర్లలో 93 పరుగులకే చాపచుట్టేసింది.

అనంతరం 94 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రైడర్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయినప్పటికీ, 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. ఈ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(Man of the Match)’గా నిలవగా, టోర్నీ అంతటా నిలకడగా రాణించిన శ్రీకాంత్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నారు.
అలాగే చందు బెస్ట్ బౌలర్గా, నవం బెస్ట్ బ్యాట్స్మన్గా అవార్డులు అందుకున్నారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ నాయకుడు నాతరి స్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీ(Cricket Academy) అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని, ప్రస్తుతం అద్దె స్థలంలో ఉన్న అకాడమీకి శాశ్వత ప్రభుత్వ స్థలం కేటాయించేలా ఎమ్మెల్యేతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ వేడుకలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పైడిమల్ల నర్సింగ్, అల్లం వెంకటేశ్వర్లు, గడ్డం రాజేష్ గౌడ్, కోచ్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

