దళారులను నమ్మవద్దు..
ఉమ్మడి మెదక్ బ్యూరో ( ఆంధ్ర ప్రభ): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేలసంగంలో శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహా (Damodar Raja Narsimha) మాట్లాడుతూ.. పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర (MSP )ను కల్పించాలని CCI అధికారులను మంత్రి కోరారు. దళారులను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా సదాశివ పేట, రాయికోడ్, నారాయణ ఖేడ్, జోగిపేట, వాట్పల్లి మండలాల పత్తి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
పత్తి రైతులు కనీస మద్దతు ధర (MSP ) కోసం ‘కపాస్ కిసాన్ ‘మొబైల్ యాప్ ను డౌన్ లోన్ చేసుకోవాలని CCI అధికారులు కోరారు. గత వర్షాకాలం (2024-25) లో 3 లక్షల 80 వేల క్వింటాల్ల పత్తిని కొనుగోలు చేసి రైతులకు 280 కోట్ల రూపాయలను చెల్లించామని CCI అధికారులు మంత్రి దామోదర్ రాజనర్సింహాకు వివరించారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా రైతులకు జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో CCI సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ వరుణ్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

