రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తుండగా, ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్లోని ఇతర ఉద్యోగులు, సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా, నాలుగు రోజుల క్రితం ఏలూరు నగరంలోని శాంతినగర్కు చెందిన ఇద్దరు వృద్ధులకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో కొంత ఆందోళన నెలకొంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.