ADB |ఆదివాసీలను అన్ని రంగాల్లో చైతన్య పర్చడమే కాంగ్రెస్ ధ్యేయం.. రాహుల్ బల్

జన్నారం, మే11 (ఆంధ్రప్రభ): ఆదివాసీలను, గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్య పరచడమే కాంగ్రెస్ ధ్యేయమని ఏఐసీసీ జాతీయ నాయకుడు రాహుల్ బల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ముగ్గురు చొప్పున గిరిజన, ఆదివాసీల కాంగ్రెస్ ప్రతినిధులకు మూడు రోజులు నిర్వహించే శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో తొలిరోజు ఆదివారం జ్యోతి ప్రజ్వలన గావించి నేతలు ప్రారంభించారు. ముందుగా దేశం కోసం పాకిస్తాన్ తో పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు నేతలు నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందన్నారు. గిరిజన, ఆదివాసీలను రాజకీయ, విద్యపరంగా చైతన్య పరుస్తూ ముందుకు తీసుకుపోతుందన్నారు.

అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ… కేంద్రంలో ఆదివాసుల కోసం పలు చట్టాలను అమలు చేసిందన్నారు. జల్‌, జంగిల్‌, జమీన్‌ నినాదానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. ఈ నినాదంతో రాహూల్‌ గాంధీ పాదయాత్ర కూడా చేశారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే పీసా చట్టం వచ్చిందని, గిరిజన, ఆదివాసీల హక్కులకోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, పార్టీ సీనియర్ నేతలు గుర్రం మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, నందునాయక్, తిరుపతి నాయక్, రవీందర్, సుధాకర్ నాయక్, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర నాయకుడు సోహెల్ షా, ఎం.ఇందయ్య, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, రాజన్న యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసరి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply