న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల (ఆన్లైన్ వేదికల ద్వారా పనిచేసేవారు) హక్కులు, సంక్షేమంపై గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ కార్మికులు తనతో పంచుకున్న ఆవేదనను గుర్తుచేసుకున్నారు. “మాకు రేటింగ్ కాదు, హక్కులు కావాలి. మేము మనుషులమే కానీ, బానిసలం కాదు” అని వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తన మదిలో బలంగా నాటుకుపోయాయని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. గిగ్ కార్మికుల భద్రత, న్యాయమైన ఒప్పందాలపై కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చారిత్రాత్మకమైందని అభివర్ణించారు.
ఆర్డినెన్స్తో భరోసా..
కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్ల హక్కులు, గౌరవం, భద్రతకు హామీ ఇస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం చారిత్రాత్మక ముందడుగు అని రాహుల్ ప్రశంసించారు. ఎండ, వాన, చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని గిగ్ కార్మికులు మనకు ఆహారం, నిత్యావసర వస్తువులు చేరవేస్తారని అన్నారు. అయినప్పటికీ, వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎలాంటి వివరణ లేకుండా యాప్ల నుంచి వారిని బ్లాక్ చేయడం, అనారోగ్యానికి గురైతే సెలవులు కూడా మంజూరు కాకపోవడం, వారికి చెల్లించే మొత్తాలు పారదర్శకత లేని అల్గోరిథమ్ల ద్వారా నిర్ణయించబడటం వంటివి గిగ్ వర్కర్ల ప్రధాన సమస్యలని ఆయన వివరించారు.
ఆ పరిస్థితులను సమూలంగా మార్చేస్తాం..
కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్ ఈ పరిస్థితులను మార్చనుందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, న్యాయమైన ఒప్పందాలు, చెల్లింపుల విషయంలో అల్గోరిథమిక్ పారదర్శకత, ఏకపక్షంగా యాప్ల నుంచి తొలగించకుండా రక్షణ వంటివి లభిస్తాయని స్పష్టం చేశారు.
సేవ చేసేలా టెక్నాలజీ ఉండాలి..
టెక్నాలజీ అనేది ప్రజలకు సేవ చేసేదిగా ఉండాలని, ఈ విషయంలో రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాలు మార్గదర్శకంగా నిలిచాయని రాహుల్ అన్నారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదేబాటలో పయనిస్తుందని సూచనప్రాయంగా తెలిపారు. గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత పనులు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, అవి పని సంబంధాలను పునర్నిర్మిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల హక్కులే కేంద్రంగా ఈ వ్యవస్థలు ఉండాలని, ఈ విధానాన్ని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.