Condolence | క‌స్తూరి రంగ‌న్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం.. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ -ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా రంగంలో కస్తూరి రంగన్ విశేష సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్‌గా, ముఖ్యంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో వారు పోషించిన పాత్ర దేశం మరిచిపోదని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న అధికారికి ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.

రాజ్యసభ సభ్యుడిగా, జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌గా, కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా, ఖగోళ శాస్త్రవేత్తగా విశేష సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందని పేర్కొన్నారు. డాక్టర్‌ కస్తూరి రంగన్ మరణం దేశానికి తీరనిలోటు అని అన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తమ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *