న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-ఇరాన్ల (Israel – Iran) మధ్య కొనసాగుతున్న యుద్ధంపై (war) భారత్ మౌనం (silence) వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (sonia gandhi) తప్పుబట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మౌనం దౌత్య వైఫల్యంలా కన్పిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి భారత దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఈ మేరకు సోనియా ఒక ప్రకటనను నేడు విడుదల చేశారు.. టెహ్రాన్ పై , టెల్ అవీవ్ చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమైనవిగా.. సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు.
ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల వల్ల ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని సోనియా పేర్కొన్నారు. ఈ ఘర్షణలు అస్థిరతను మరింత తీవ్రతరం చేయడం వల్ల మరిన్ని సంఘర్షణలకు బీజాలు వేస్తాయన్నారు.
ఇరాన్, అమెరికాల మధ్య అణు చర్చలకు మార్గం సుగమం అవుతున్న సమయంలో టెల్ అవీవ్ ఒక్కసారిగా టెహ్రాన్ లోని అణుస్థావరాలపై దాడులకు దిగడం సరైన చర్య కాదని సోనియా అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎంతో కాలంగా మిత్రదేశంగా ఉన్న ఇరాన్ దూరం చూసుకోవద్దని మోదీ ప్రభుత్వానికి హితవు పలికారు..
మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో గాజాలో 55 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం గాజా కరవు అంచున ఉండడంతో అక్కడ మిగిలిఉన్న ప్రజలు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గాజాలో జరిగిన విధ్వంసం మళ్లీ ఇరాన్లో పునరావృతం అవకుండా మరింత ఆలస్యం అవ్వకముందే భారత్ కల్పించుకోవాలని అన్నారు.