న్యూ ఢిల్లీ – దక్షిణ భారతదేశంలో ఎవరిపైనా హిందీని రుద్దలేదని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తాను దక్షిణ భారతదేశానికి చెందినవాడిని కానీ హిందీ మాట్లాడటానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు… తాను హిందీ చదవలేదని, కానీ హిందీ నేర్చుకున్నానని చెప్పారు. కొత్తఢిల్లీలో ఒక ప్రైవేటు టి వి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని కోరారే తప్పా ఎప్పుడూ తప్పనిసరి చేయలేదని గుర్తు చేశారు..ఈ విషయాన్ని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు హిందీని వ్యతిరేకిస్తున్న వారు అర్థం చేసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి సూచించారు. కాగా హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడుతో పాటు మరికొన్ని సౌత్ స్టేట్స్ కూడా హిందీపై తమ వ్యతిరేకతను కొన్ని సందర్భాల్లో వెల్లడించాయి.
అలాగే ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. మేం ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాదే అని అన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీ ప్రభుత్వాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నించారు. కాగా, ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చని, కానీ బీజేపీలో అలా కాదు.. జేపీ నడ్డా తర్వాత.. అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడంటూ కిషన్రెడ్డి పేర్కొన్నారు.