వెలగపూడి – ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకోనున్నారు. నేటి ఉదయం 11.30 గంటలకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చేరుకుంటారు. ఈ తరుణంలో ముప్పాల్ల గ్రామంలోని డా.బీ.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు.
ఈ క్రమంలో అక్కడ విద్యార్తులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేస్తారు. అనంతరం 11.46 గంటలకు నిమ్మతోటలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ముప్పాళ్లలోని వేబ్రిడ్జీ స్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 3.40 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 4.05 గంటలకు సీఎం చంద్రబాబు తన నివాసానికి చేరుకుంటారు.
బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి..
ప్రముఖ జాతీయ నాయకుడు సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించుకుంటామనే విషయం తెలిసిందే. బాబుజీ అని ముద్దుగా పిలవబడే ఆయన జీవితం.. సందేశాలు తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉన్నాయి. సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
ఈ నేపథ్యంలో “భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్పూర్తివంతమైన సేవలు అందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ అభ్యుదయ నాయకుని స్మృతికి నివాళులు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబుజీ స్పూర్తిగా మనందరం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. బాబు జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం” అని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.