న్యూ ఢిల్లీ – భారతదేశంలోని విమానాశ్రయాలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో విధుల నిర్వహిస్తున్న సెలెబీ ఏవియేషన్ ఇండియా సంస్థ కీలక ప్రకటన చేసింది. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి ఆర్థిక, నిర్వహణ పరమైన సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమది అసలు తుర్కియేకు చెందిన సంస్థే కాదని, ఎర్డోగాన్ కుమార్తె తమ బాస్ కాదని వివరణ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు తుర్కియే మద్దతు ఇస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులు, సేవలను బహిష్కరించాలనే డిమాండ్లు భారత్లో ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సెలెబీ ఏవియేషన్ ఇండియా ఈ ప్రకటన విడుదల చేసింది.
కొంతకాలంగా భారత్-తుర్కియే మధ్య సంబంధాలు అంత సానుకూలంగా లేని విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్కు తుర్కియే బాహాటంగా మద్దతు పలకడం, పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వంటివి భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో తుర్కియే సంస్థలను, ఉత్పత్తులను భారత్లో నిషేధించాలనే డిమాండ్లు సోషల్ మీడియాతో పాటు వివిధ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారతీయ విమానాశ్రయాలలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు అందిస్తున్న ‘సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్’ (సెలెబీ ఏవియేషన్ ఇండియా) అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన సెలెబీ తమ కార్యకలాపాలు, యాజమాన్యం గురించి కీలక విషయాలు వెల్లడించింది. తాము అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, భారతీయ చట్టాలకు లోబడే నడుచుకుంటున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పాకిస్థాన్కు తుర్కియే మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తమ సంస్థపై అనవసరంగా అనుమానాలు వ్యక్తం చేయడం తగదన్నారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో తమ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు సెలెబీ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. భారత ప్రభుత్వం అనుమతుల రద్దు చేసిందన్న వార్తలపై సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.