హైదరాబాద్, ఆంధ్రప్రభ : మూవీ పైరసీని అరికట్టేందుకు ఓ ఉద్యమం రావాలని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మిస్తుంటే అవి పైరసీకి గురై నిర్మాతలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టించుకోని నటీనటులు
ఈ విషయంలో నటీనటులు, హీరోలు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను పైరసీ భూతం పట్టి పీడిస్తోందని తెలిపారు. మూవీ రిలీజ్కు ముందు అంతా బాగానే ఉంటుందని.. ఆ తరువాత మూవీ రిలీజై నిర్మాత నష్టపోతే పట్టించుకోకుండా మరో సినిమా పనిలో అంతా బీజీగా ఉంటున్నారని కామెంట్ చేశారు. పైరసీని అరికట్టేందుకు ఎఫ్డీసీ చైర్మన్గా తాను ఉద్యమాన్ని లీడ్ చేస్తానని అన్నారు. ఈ విషయంలో నిర్మాతలు అంతా కలిసి రావాలని.. అండర్ ప్రొడక్షన్లో ఉన్న వారు కూడా ఇందులో భాగస్వాములు కావాలని దిల్ రాజు పిలుపునిచ్చారు.