హైదరాబాద్ : ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు చేప మందును పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు
వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 13 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టారు.
ఆది,సోమవారాల్లో జరుగనున్న ఈ కార్యక్రమం కోసం.. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నది. నగరం నలుమూలల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు 140 స్పెషల్ బస్సులను తిప్పుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి బస్సులను సిద్ధంగా ఉంచింది. ప్రయాణికుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ పనులను పర్యవేక్షిస్తుండగా, జల మండలి మంచినీటి సరఫరా చేస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ, సోమవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. దీనికోసం మత్స్య శాఖ లక్ష చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది