Chemical | పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు…

Chemical | పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు…
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలతో ప్రత్యేక బృందాల చొరవ
Chemical | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : వేసవి నేపథ్యంలో పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలతో పాటు ఇతర పారిశ్రామిక ప్రమాదాలు జరక్కుండా చూడటంలో భాగంగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని.. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి (డీఐవో) ఎం.మధు తెలిపారు. బుధవారం ప్రత్యేక పారిశ్రామిక తనిఖీ బృందాలు కొండపల్లి ఐడీఏలోని నిఫ్టీ ల్యాబ్స్ తదితర సంస్థల్లో తనిఖీలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా పరిశ్రమల అధికారి మధు మాట్లాడుతూ పరిశ్రమలు, అగ్నిమాపక, ఫ్యాక్టరీలు, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్, పోలీసు, కార్మిక శాఖ, బాయిలర్, రెవెన్యూ, ఏపీఐఐసీ, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫార్మా, కెమికల్, సిమెంటు, బాణసంచా గోదాములు, ఎల్పీజీ బాట్లింగ్ యూనిట్లు, మధ్య, భారీ పరిశ్రమలు తదితరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సరిగా ఉన్నాయో లేదో చెక్లిస్టు ప్రకారం తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. అగ్నిమాపక పరికరాల పనితీరు, ప్రమాదకర రసాయనాల నిల్వ విధానం, విద్యుత్ వ్యవస్థల స్థితిగతులు, భద్రతా పరికరాల ధ్రువపత్రాలు, కార్మికుల భద్రత తదితరాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కొండపల్లి ఐడీఏలోని ఇన్కెమ్ ల్యాబ్స్, రాణి లైఫ్ సైన్సెస్, నిఫ్టీ ల్యాబ్స్, ఆర్చ్ ల్యాబ్స్ తదితర సంస్థల్లో తనిఖీలు నిర్వహించామని, మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్నట్లు పరిశ్రమల అధికారి మధు తెలిపారు.
