న్యూ ఢిల్లీ – దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మధ్య మరింత సమన్వయం, సమైక్యత సాధించే దిశగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ( Rajnath singh ) ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) (CDS) జనరల్ అనిల్ చౌహాన్కు (anil chowhan ) మూడు సేవలకూ కలిపి ఉమ్మడి ఆదేశాలు, సూచనలు జారీ చేసే అధికారాన్ని అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు (orders ) జారీ అయ్యాయి.
ఇంతకుముందు, రెండు లేదా అంతకంటే ఎక్కువ సేవలకు సంబంధించిన సూచనలు లేదా ఆదేశాలను ప్రతి సర్వీసు విభాగం విడివిడిగా జారీ చేసే పద్ధతి ఉండేది. తాజా నిర్ణయంతో ఈ పాత విధానానికి తెరపడినట్లయింది. సాయుధ దళాలలో ఆధునికీకరణ, పరివర్తన తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
“ఉమ్మడి సూచనలు, ఉమ్మడి ఆదేశాల ఆమోదం, ప్రకటన, నంబరింగ్” అనే అంశంపై మొట్టమొదటి ఉమ్మడి ఉత్తర్వును మంగళవారం విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కొత్త విధానం ద్వారా కార్యకలాపాల సరళీకరణ, అనవసరమైన అంశాల తొలగింపు, సేవల మధ్య సహకారం పెంపొందించడం వంటివి సాధ్యమవుతాయని ఆ ఉత్తర్వు స్పష్టం చేసింది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు ఈ అధికారాలను కట్టబెట్టడం సాయుధ దళాల ఆధునికీకరణ, పరివర్తన దిశగా ఒక పెద్ద ముందడుగు అని రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. “రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కార్యదర్శికి మూడు సర్వీసుల కోసం ఉమ్మడి సూచనలు మరియు ఉమ్మడి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఇచ్చారు. ఇది సాయుధ దళాల ఆధునికీకరణ, పరివర్తన దిశగా ఒక కీలకమైన పరిణామం” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ చొరవ మూడు సేవలలో పారదర్శకత, సమన్వయం, పరిపాలనా సామర్థ్యం మెరుగుపడటానికి పునాది వేస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. “ఇది దేశానికి సేవ చేయడంలో సాయుధ దళాల లక్ష్య సాధనలో ఏకత్వాన్ని బలోపేతం చేస్తూ, సమైక్యత, ఏకీకరణ యొక్క నూతన శకానికి నాంది పలుకుతుంది” అని వివరించింది.
ఆర్మీ, నేవీ, వైమానిక దళాల మధ్య మరింత సమన్వయం, సమష్టి కార్యాచరణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన థియేటరైజేషన్ నమూనాను అమలు చేయడంలో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటరైజేషన్ నమూనా కింద, ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యొక్క సామర్థ్యాలను ఏకీకృతం చేసి, యుద్ధాలు మరియు కార్యకలాపాల కోసం వారి వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక ప్రకారం, ప్రతి థియేటర్ కమాండ్లో ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన విభాగాలు ఉంటాయి. అవన్నీ ఒక నిర్దిష్ట భౌగోళిక భూభాగంలోని భద్రతా సవాళ్లను పర్యవేక్షిస్తూ ఒకే సంస్థగా పనిచేస్తాయి. ప్రస్తుతం, ఆర్మీ, నేవీ, వైమానిక దళాలకు వేర్వేరు కమాండ్లు ఉన్న సంగతి తెలిసిందే.