TG | కాసినో పుణ్యం కేటీఆర్ దే… అద్దంకి దయాకర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణను కాసినో హబ్గా కేటీఆర్ మార్చారని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే కాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఫామ్ హౌస్లో జరగడం దేనికి సంకేతమన్నారు. గాంధీభవన్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేటీఆర్ బావమరిది ఇంట్లో ఓ పార్టీలో కొకైన్ పట్టుబడిందని గుర్తు చేశారు అద్దంకి. ఆ మాత్రం తీసుకోవద్దా అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమాలకు ముమ్మాటికీ బాధ్యుడు కేటీఆరేనని అన్నారు. కేటీఆర్ కూడా శిక్షార్హుడేనన్నారు.
దొంగలకు లీజుకు ఇస్తే వాళ్ళు దొంగలే అవుతారన్నారు. సూరత్ పోర్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి వస్తుందన్నారు. ఇక పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ గుట్టు బయటపడిందన్నారు. పీసీసీ హోదాలో రేవంత్ వైట్ చాలెంజ్ చేస్తే కేటీఆర్ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
కేసీఆర్ కుటుంబంలో నలుగురు వాళ్ళ కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పర్మిషన్ తో రెండేళ్ల నుంచి ఈ పందెలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఫార్ములా రేస్లో విచారణకు వెళ్లినప్పుడు జై తెలంగాణ అంటారని, ఆ హక్కు మీకు లేదన్నారు. లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లిన కవిత తెలంగాణలో పర్యటించడానికి అనర్హురాలని పేర్కొన్నారు.
పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ ఫిరాయించారో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలన్నారు. హీరో కావడానికి జీరో పనులు కేటీఆర్ చేస్తున్నారని అన్నారు అద్దంకి దయాకర్. నాలుగేళ్ల తర్వాత కూడా కేసీఆర్ బయటకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో మెయినాబాద్ ఫామ్ హౌస్ గురించి అద్దంకి ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడతారో చూడాలి.