చేవెళ్ల : కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ – జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారాం పూర్ గ్రామానికి చెందిన మహేందర్ – ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తన మామయ్య తెలుగు రాంబాబు పెళ్లి (ఈనెల 30న) నిమిత్తం చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామానికి వచ్చారు.
ఇంటి ముందు గల తమ మామయ్య కారులోకి ఇద్దరు పిల్లలు ఇవాళ మధ్యాహ్నం 12:30 నిమిషాల ప్రాంతంలో ఎక్కారు. ఈ విషయాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు గమనించలేదు. బయట ఎక్కడో ఆడుకుంటున్నారని భావించారు. అయితే మధ్యాహ్నం 2గంటల సమయంలో కారులో చూడగా.. ఇద్దరు చిన్నారులు స్పృహ తప్పి పడి ఉన్నారు. లాక్ తీసి కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఇద్దరు పిల్లలను తరలించారు. చిన్నారులను వైద్యులు పరీక్షించినా ఫలితం లేకపోయింది… అప్పటికే ఆ ఇద్దరు పిల్లలు మృతిచెందారు. చిన్నారుల తల్లిదండ్రుల రోధనలతో ఆసుపత్రి ప్రాగణం దద్దరిల్లింది.
