హైదరాబాద్ – ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )జరుగుతున్న నేపథ్యంలో నగరంలో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. హైదరాబాద్లోని హఫీజ్పేట్లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును మియాపూర్ ఎస్ వో టి పోలీసులు బట్టబయలు చేశారు. హఫీజ్ పేట లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఎస్ ఓటీ పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యభర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ప్రాంతంలో నివసిస్తున్న మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వీరి అకౌంట్లను పరిశీలించగా, ఏకంగా 40 లక్షల రూపాయల విలువైన బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
పోలీసులు బెట్టింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో నిందితుల నుంచి రూ. 55,000 నగదు, బ్యాంక్ ఖాతాల్లో రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా.. మొత్తం 7 అకౌంట్లను గుర్తించారు. అజయ్ గతంలోనే నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడ్డాడు. గతంలోనూ బెట్టింగ్ లు నిర్వహిస్తూ పట్టుబడి నాలుగు సార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ, మరోసారి బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు ఈ బెట్టింగ్ ముఠాతో సంబంధమున్న ముగ్గురు ఫంటర్లను అదుపులోకి తీసుకుని, వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు.