- ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు
ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : విద్యార్థులు నైతిక విలువలతో ఉంటూ క్రమశిక్షణతో మెలగాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. అప్పుడే వారు జీవితంలో ముందుకు వెళ్లగలరని తెలిపారు. మచిలీపట్నంలోని దేవాలయాల సందర్శనార్థం విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ నందు గల ఐఎంఏ ఫంక్షన్ హాలు నందు పలువురు విద్యార్థులతో శనివారం ముచ్చటించారు.
నైతికత, విలువలు మనిషి జీవితానికి ఆధార స్తంభాలు అని పేర్కొన్నారు. నైతికత అంటే సత్యం, న్యాయం, కరుణ, నమ్మకం వంటి సద్గుణాలను పాటించడం అన్నారు. విలువలు అంటే మన ప్రవర్తనకు మార్గదర్శకమైన సూత్రాలు, ఇవి కుటుంబం, సమాజం, విద్య ద్వారా అభివృద్ధి చెందుతాయన్నారు.
నైతికత, విలువలు ఉన్నవారు ఇతరులను గౌరవిస్తారు అని, సమాజంలో సమానత్వం, శాంతి నెలకొల్పుతారు అన్నారు. ఇవి వ్యక్తిత్వ వికాసానికి, మంచితనానికి ప్రతీకలు అన్నారు. జీవితంలో సక్సెస్ మాత్రమే కాకుండా మంచి మనిషిగా ఎదగడానికి కూడా నైతికత విలువలు ఎంతో అవసరం అన్నారు.
వాటిని పాటించడం ద్వారా మన జీవితం సార్థకం అవుతుందని, దాని ద్వారా కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో ముందుకు వెళ్ళినప్పుడే భవిష్యత్తులో మంచి ఉన్నత పురో గ అభివృద్ధిని సాధిస్తారు అని విద్యార్థులకు వారు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఫణి కుమార్, కాళీపట్నపు రఘు తదితరులు పాల్గొన్నారు.

