కరీంనగర్ ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రస్టు పట్టిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని దౌర్భాగ్యపు పాలన నడుస్తుందన్నారు. జన్ పత్, గాంధీభవన్ నుండి పాలన నడుస్తూ ఉండడం విడ్డూరంగా ఉందన్నారు.

మంత్రివర్గంలో ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరమని,మంత్రివర్గ విస్తరణ సీఎం విచక్షణాధికారం అన్నారు.కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటని, తెలంగాణ లో దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారన్నారు. పాలనపై సీఎంకు పట్టులేకుండా పోయిందని, హెచ్ సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణమన్నారు.
కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై మజ్లిస్ ను గెలిపించాలను కుంటనాయన్నారు. హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయని, దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ అని, దేశభక్తి పార్టీ బీజేపీ అన్నారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీకి, దేశభక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఎవరి పక్షాన నిలబడి ఓటేస్తారో హైదరాబాద్ కార్పొరేటర్లు, ఓటర్లు ఆలోచించాలన్నారు. సిద్ధాంతం కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి గౌతంరావు గెలుస్తారనే నమ్మకం ఉందని, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నడో కుమ్కక్కైనాయన్నారు.
చెన్నయ్ లో డీలిమిటేషన్ మీటింగ్ కు రెండు పార్టీలు కలిసే హాజరైనాయని, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలిసే ఓటేసి నాయన్నారు. 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొడుకులు, అవమానాలను అధిగమించిన పార్టీ బీజేపీ అన్నారు. వేలాది మంది కార్యకర్తల బలిదానాలు, లక్షలాది మంది పోరాటాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ భావజాలం, సిద్ధాంత బలమే బీజేపీ ఈ స్థాయికి చేరిందన్నారు.
2019లోనే బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీగా అవతరించిందన్నారు. 16 రాష్ట్రాల్లో సొంతంగా, 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తున్నామన్నారు. వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశ సత్తా చాటినామని, స్వర్ణ చతుర్భుజీ పేరుతో జాతీయ రహదారులను విస్తరించిన ఘనత బీజేపీదే ఆన్నారు.
చిట్టచివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న దీన్ దయాళ్ ఆశయాలను కొనసాగిస్తున్నామని, మోదీ పాలనలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అద్బుత ఫలితాలను కనబరుస్తోందన్నారు. అభివ్రుద్ధి, సంక్షేమంలో దేశం దూసుకుపోతోందని, కేంద్ర సంక్షేమ పథకాలను పూర్తిగా తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు.
అన్ని రాష్ట్రాలను సమాన థ్రుక్పథంతో చూస్తూ అభివ్రుద్ధి చేస్తున్న ప్రభుత్వం మోదీదే అని,రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఇచ్చేది మోదీ బియ్యమే అన్నారు. కిలోకు రూ.37 లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మోదీదే అని, సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం 10 రూపాయలు మాత్రమే అన్నారు.ఆ విషయాన్ని తెలుసుకుని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడితే మంచిదన్నారు. అట్లాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫోటో ఎందుకు పెట్టకూడదన్నారు.
బీజేపీ కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి ప్రజలకు రేషన్ బియ్యంపై వాస్తవాలు వివరించాలన్నారు. వడ్ల కొనుగోలు నుండి బియ్యం దాకా ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు.గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ ఎవరు చెల్లిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.