గుంటూరు – ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్టులు పెట్టిన ముగ్గురు యువకులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీలో సంచలనం రేపింది. ఇటీవల కాలంలో ఏపీలో కొందరు రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నవారు.. అలాగే హీరోలకు సపోర్ట్గా ఉండే ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులపై ఏపీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోచ్ గాయపడటం తెలిసిందే. భారీ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన మార్క్ శంకర్ను అక్కడ ప్రాథమికంగా చికిత్స జరిపించి హైదరాబాద్కు తీసుకొచ్చారు. పవన్ కుటుంబం ఇలా కష్టాల్లో ఉండగా.. ఆయన కుటుంబంపై కొందరు దారుణమైన భాషతో పోస్టులు పెట్టిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.
పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల, ఆయన కుమారుడు మార్క్ శంకర్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతర కామెంట్లతో కూడిన పోస్టులు పెట్టారు. వాటిని పరిశీలించిన సైబర్ క్రైమ్ విభాగం గుంటూరులో కేసు నమోదు చేశారు. అనంతరం కర్నూలు పోలీసులు ముగ్గురు యువకులను గూడురులో అరెస్ట్ చేశారు. పవన్ భార్య, కుమారుడిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురిని ఫయాజ్, పుష్పరాజ్, ఉదయ్ కిరణ్గా గుర్తించారు. ఈ ముగ్గురు ఎక్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి గతంలో క్రిమినల్ చరిత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఫయాజ్, పుష్పరాజ్ సెల్ ఫోన్ షాపులో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అయితే వీరికి ఏదైనా పార్టీతో సంబంధం ఉందా? ఏ హీరో అభిమాన సంఘాలతో రిలేషన్ ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురు ఎవరైనా ప్రేరేపించి పోస్టులు పెట్టారా? అనే విషయంపై కూడా పోలీసులు దృష్టిపెట్టారు.
ఈ ముగ్గురు అరెస్ట్ తర్వాత ఏపీ పోలీసుల కఠినమైన హెచ్చరికలు చేశారు. ఏ రాజకీయ నేత కుటుంబాలపైన ఎవరైనా కామెంట్ చేసినా అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత దూషణలు, ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.