- బీజేపీ రాష్ట్ర నాయకులు కొప్పుల నరసింహారెడ్డి
- అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాను – సర్పంచ్ అభ్యర్థి స్వప్న
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో బీజేపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునుగాల స్వప్న మహిపాల్ రెడ్డి గెలుపుతోనే గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారమై అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు, జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు.
ఆదివారం ఆరెగూడెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మునుగాల స్వప్న మహిపాల్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తోందని, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి ఆరెగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని కేంద్ర మంత్రుల సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రజాసేవే లక్ష్యంగా మునుగాల స్వప్న మహిపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆరెగూడెం గ్రామ సర్పంచ్గా మునుగాల స్వప్న మహిపాల్ రెడ్డికి కేటాయించిన కత్తెర గుర్తుపై పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి స్వప్న మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిరంతరం సేవ చేస్తానని అన్నారు. గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి ఆరెగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

